Anchor Shyamala: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అమలవుతున్నట్లు చెబుతున్న ‘రెడ్బుక్ రాజ్యాంగం’ వల్ల ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ మండిపడ్డారు.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రైతు “అన్నమో రామచంద్ర” అంటూ లబోదిబో మంటూ ఏడ్చే పరిస్థితి నెలకొందని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే రెండు సంక్రాంతుల్లో ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపించకపోవచ్చు.. కానీ, 2029 తర్వాత వచ్చే సంక్రాంతి నాటికి ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు తెచ్చే బాధ్యతను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఇక, ఈ బోగి మంటల్లో రాష్ట్రానికి కీడుగా మారిన రెడ్బుక్ను తగలబెట్టాలని పిలుపునిచ్చారు శ్యామల.. ఈ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని ఆరోపించారు. ఇప్పటి పరిస్థితి ఏంటంటే.. ఈ రెడ్బుక్ రాజ్యాంగంలో కోడిని కోసినా కేసే.. కేక్ కట్ చేసినా కేసే.. అన్నట్టుగా పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తున్నాయని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితులకు ప్రజలే తగిన సమయంలో గట్టి సమాధానం చెబుతారని, రాష్ట్రంలో మళ్లీ న్యాయం, సంక్షేమం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ ఆరే శ్యామల..