మా ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయింది వెతికిపెట్టండి. మా ఇంట్లో పిల్లి కనిపించడం లేదు. మా ఇంట్లో నెక్లెస్ పోయింది.. వాళ్ళ మీద అనుమానంగా వుంది. ఆ సంగతి చూడండి అంటూ పోలీసులకు కంప్లైంట్లు రావడం కామన్. అసలే రాజకీయంగా ఎవరిమీద కేసులు పెట్టాలి, అధికార పార్టీ నేతల నుంచి వచ్చే కంప్లైంట్స్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రోజులివి. దానికి తోడు ఇతర నేరవార్తలు వారిని నిలువ నీయకుండా చేస్తుంటాయి. బంగారు, నగదు దోచుకెళ్లారని తరచూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం పరిపాటి. అయితే దానికి భిన్నంగా ఈ ఘటన చోటచేసుకుంది.
అదేదో సినిమాలో పెన్సిల్ పోయిందని ఓ కుర్రాడు కంప్లైంట్ ఇస్తాడు. అచ్చం అలాంటిదే ఇప్పుడో విచిత్రమయిన కంప్లైంట్ పోలీసులకు అందింది. తన తెల్ల కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ చిత్రమయిన కంప్లైంట్ చూసిన పోలీసులకు తలనొప్పి వచ్చింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వెంకటాద్రి. అల్లారుముద్దుగా పెంచుకున్న జాతి కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్లారని అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పోలీస్ స్టేషన్లో అరుదైన ఫిర్యాదు చేశాడు వెంకటాద్రి. గత నెల 29 వ తేదీన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆలస్యంగా వెలుగు చూసిన అరుదైన ఫిర్యాదు చూసి జనం నవ్వుకుంటుంటే… ఈ కోడిపుంజు దొంగను ఎలా పట్టుకోవాలో తెలీక తెగ ఇదై పోతున్నారు ఖాకీలు.
వాల్మీకిపురం మండలం, తాటిగుంటపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దవంకపల్లెకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు వెంకటాద్రి కోడిపుంజు చోరీపై లబోదిబోమంటూ వాల్మీకిపురం పోలీసులను ఆశ్రయించాడు. ఏడాదిన్నర క్రితం తమిళనాడు రాష్ట్రం, సేలం నుంచి జాతి పుంజులను తెచ్చుకొని పెంచుతున్నాడు. అందులో ఒక్కగానొక్క పుంజు మాత్రమే బతకడంతో ఆ పుంజును ఎంతో ఇష్టంగా పెంచి పోషించారు. వీరికి పుంజులను పెంచే అలవాటు వుంది. మూడు రోజుల క్రితం దొంగలు రూ. 9 వేలు విలువగల జాతి కోడి పుంజును ఎత్తుకెళ్లారు.
ఎంతో మురిపంగా పెంచుకున్న జాతి కోడి పుంజులు దొంగిలించారని వెంకటాద్రి వాల్మీకిపురం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెద్దవంక గ్రామ పరిసరాల్లో తరచూ కోడిపందాలు జరుగుతుంటాయని, పందాల కోసమే దొంగలు అపహరించి వెళ్లారని అనుమానం వ్యక్తం చేసాడు. అయితే ఇందుకు భిన్నంగా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలతో సమానంగా పెంచుకున్న కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్ళారని ఫిర్యాదు చేయడం చేయడం గమనార్హం. నా కోడి పుంజు నాకు తెచ్చి ఇవ్వాలని వెంకటాద్రి వాల్మీకిపురం పోలీసులకు వేడుకుంటున్నాడు. వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్ఐ బిందు మాధవి మీడియాకు తెలిపారు. మీకు ఆ కోడిపుంజు కనిపిస్తే పోలీసులకు చెప్పి పుణ్యం కట్టుకోండి. వాళ్ళ తలనొప్పి తగ్గించండి.