విపక్షాల అఖిలపక్ష సమావేశంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని.. సీఎం వైఎస్ జగన్పై నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎందుకు మీ అందరికీ భయం? కలిసి ఎందుకు పోరాటం చేయాలనుకుంటున్నారు? అంటూ నిలదీశారు.. చంద్రబాబు ఏ డ్యాన్స్ వేయమంటే ఆ డ్యాన్స్ వేస్తారు సీపీఐ రామకృష్ణ.. ఎక్కడ చిందు వేయమంటే అక్కడ వేస్తారు.. నారాయణ, రామకృష్ణ, వంటి కుహనా మేధావులు అందరూ చంద్రబాబు పక్కన చేరారని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీతో కుమ్మక్కై మీరందరూ ఎన్ని కుట్రలు చేసినా అన్నీ ఛేదించుకుని వచ్చారు జగన్ అని పేర్కొన్న ఆయన.. మీ ధర్నాలకు వైసీపీ చిన్న కార్యకర్త కూడా భయపడే పరిస్థితి లేదన్నారు. జీతాలు ప్రతి నెలా ఉద్యోగుల ఖాతాల్లో పడుతున్నాయి.. జీతాలు రాకపోతే ఉద్యోగ సంఘాలు ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు.. కోర్టు మొట్టి కాయలు వేసినా జనసేనకు బుద్ధి రావటం లేదని సెటైర్లు వేసిన ఆయన.. జగన్ ను తిట్టడానికి ప్రతి ఆదివారం ఒక అడ్డ గాడిద వస్తోంది.. అడ్డ గాడిదలకు కూడా వాక్ స్వాతంత్రం ఉన్నట్లేగా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Minister Kottu Satyanarayana: ఉనికి కోసమే టీడీపీ ఆరాటం.. పార్టీ బతికే ఉందని చెప్పుకునే ప్రయత్నం..!
కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే భయాన్ని చంద్రబాబులో కలిగించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు పేర్నినాని.. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు అంటే వల్లమాలిన ప్రేమ ఉన్న కొంతమంది సమావేశం పెట్టుకున్నారు.. రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం లేదని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు.. నిజంగా వాక్ స్వాతంత్రం లేకపోతే మీరిలా మీటింగ్ పెట్టుకోగలరా? అని నిలదీశారు. మూడేళ్లుగా అసభ్యకరమైన భాషలో అనేక వేదికలపై నుంచి మాట్లాడుతూనే ఉన్నారుగా..! జనం జగన్ కు ఓటు వేసి తప్పు చేశారని అచ్చెన్నాయుడు అంటున్నాడు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు టీడీపీ పారిపోయింది? అని ప్రశ్నించారు. పేద వర్గాలకు 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే కమ్యూనిస్టు పార్టీలు, కమ్యూనిస్టులం అని చెప్పుకోవటానికి రామకృష్ణ లాంటి వాళ్ళు సిగ్గు పడాలన్నారు. మీ లాంటి నాయకులను చూసి కార్యకర్తలు బాధపడుతూ ఉండి ఉంటారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.
