ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై జరిగిన చర్చ , తీర్మానం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్న ఒక ‘పెద్ద డ్రామా’ అని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టి, ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కేవలం వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశాలు పిల్లి మొగ్గలతో కూడిన సర్కస్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
Nitish Kumar: రాజ్యసభలో ప్రమాణస్వీకారంపై నితీష్ కుమార్ డేట్ఫిక్స్.. ఎప్పుడంటే..!
అమరావతికి చట్టబద్ధమైన రాజధాని హోదా ఉందనడానికి ఇంతవరకు ఒక్క కాగితం కూడా లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. అందుకే కేంద్రం కేబినెట్ తీర్మానం అడిగిందని, ఆ క్రమంలోనే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. “కేవలం అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోతుందా? కౌన్సిల్ ఆమోదం లేకుండా చట్టబద్ధత ఎలా వస్తుంది?” అని ఆయన నిలదీశారు. మళ్ళీ 50 వేల ఎకరాల పొలాలు సేకరించడానికే ఈ ‘షో’ మొత్తం చేస్తున్నారని, నైరుతి (South West) వైపు రాజధానిని పెంచడం వాస్తు రీత్యా అరిష్టం కాదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ‘సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్’ అని చెబుతూనే వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తోందని నాని విమర్శించారు. ఇప్పటికే చేసిన అప్పులకు ఏటా కోట్ల రూపాయల వడ్డీలు కట్టాల్సి వస్తోందని, తాజాగా మరో 87 వేల కోట్ల అప్పులు చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. “అమరావతి పేరుతో తెచ్చిన వేల కోట్ల అప్పులు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?” అని ఆయన సవాల్ విసిరారు. మంత్రి నారాయణ అప్పుల లెక్కలపై అబద్ధాలు ఆడుతున్నారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల తరహాలోనే ఇది కూడా ఒక మాయ అని కొట్టిపారేశారు.
Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్కల్యాణ్ విమర్శలు
గతంలో తాము చేసిన తప్పులను, పాపాలను జగన్ మీద వేసి ‘గుడ్డ కాల్చి ముఖాన వేసే’ ప్రయత్నం కూటమి నేతలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టెండర్లు రద్దు చేసి, మళ్ళీ అవే కంపెనీలకు 30 శాతం అంచనాలు పెంచి ఇవ్వడంలో ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ భయంతోనే గతంలో మూటా ముల్లె సర్దుకుని అమరావతికి వచ్చారని విమర్శించారు.
2028 నాటికి హైకోర్టు, అసెంబ్లీ పూర్తి చేసి మోదీని పిలుస్తామన్న చంద్రబాబు మాటలపై నాని సెటైర్లు వేశారు. “మీరు చెప్పిన నవ నగరాలు, ప్రపంచస్థాయి నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయి? రైతుల రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎప్పుడు చూపిస్తారు?” అని నిలదీశారు. జగన్కు సినిమా ఉందో లేదో 2029లో ప్రజలే చూపిస్తారని, ముందు కూటమి నేతలు తమ సినిమా సంగతి చూసుకోవాలని హితవు పలికారు. మొత్తం మీద అమరావతి అనేది దోచుకోవడానికి తప్ప ఎవరికీ ఉపయోగపడదని పేర్ని నాని తన విమర్శల్లో ఎండగట్టారు.
