ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య లోతైన చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టదలచిన పొదుపు చర్యలను ఒక్కసారిగా ప్రజలపై రుద్దకుండా, వారికి తగిన అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పొదుపు చర్యలను మనం ఒకేసారి ప్రజలకు వివరిస్తే వారు ఇబ్బంది పడే అవకాశం ఉందని, అందుకే ఈ విషయంలో నిదానంగా ముందుకు వెళ్దామని సూచించారు. ప్రజలకు అన్ని విషయాలు విడమర్చి చెప్పిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి అదే బాటలో నడవాలని మంత్రులను ఆదేశించారు.
ఈ పొదుపు ప్రణాళికలో భాగంగా వర్క్ ఫ్రం హోం , కార్ పూలింగ్ వంటి ఆధునిక పద్ధతులను పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వంలోని ఆయా శాఖల్లో ఎక్కడెక్కడ పొదుపు చేసే అవకాశం ఉందో నివేదికలు ఇవ్వాలని కార్యదర్శులను ఆదేశించడమే కాకుండా, ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఒక కేబినెట్ సబ్కమిటీని నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రులు కూడా ఈ ప్రతిపాదనలతో ఏకీభవిస్తూ, ముందుగా రెండు రోజుల పాటు ప్రజలకు అన్ని విషయాలను స్పష్టంగా వివరించి, వారిని మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. మొత్తానికి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వారి భాగస్వామ్యంతోనే పొదుపు దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
