NTV Telugu Site icon

Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్‌.. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం..!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్‌ని తెరపైకి తెచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. జనసేన పార్టీ బీసీ సదస్సులో పాల్గొన్న ఆయన.. కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు.. నేను కాపు నాయకుడిని కాదు.. నేను కుల ఫీలింగ్‌తో పెరగలేదు.. మానవత్వంతో పెరిగాను అన్నారు. కాపు రిజర్వేషన్లపై కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పారు.. రేపు కాపు ప్రతినిధులతో జరిపే సమావేశంలో చర్చిస్తాను.. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం అన్నారు. ఈ కాంబినేషన్ ఉంటే ఎవ్వరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదన్న పవన్‌.. రోజుకు అర్ధ రూపాయి తీసుకుని ఓటు అమ్ముకునే దుస్థితి పోతే.. పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు..

బీసీలంటేనే ఉత్పత్తి కులాలు.. ఉత్పత్తి లేకుంటే సమాజమే లేదన్నారు పవన్‌ కల్యాణ్.. బీసీలంటే బ్యాక్ వార్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్‌ అన్న ఆయన.. బీసీలకు ఇన్ని ఇచ్చాం.. ఇన్ని పదవులిచ్చాం అని పార్టీలు చెప్పుకుంటున్నాయి. బీసీ కులాలకు సంఖ్యా బలం ఉన్నా దేహి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని ప్రశ్నించారు. బీసీల అనైక్యతే మిగిలిన వారికి బలం.. బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యత అన్నారు. పూలేను గౌరవించింది మనమే.. బీసీ సదస్సు అంటే ఇంత మంది వచ్చారు.. కానీ, బీసీ నేతను నిలబెడితే ఎందుకు ఓట్లేయరు..? అని నిలదీశారు. గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీపీఐ అడడిగినా బీసీ నేత అయిన పోతిన మహేష్ కోసం వారికి ఇవ్వలేదు… కానీ పరిస్థితి మీకు తెలిసిందే అన్నారు.

నేను బీసీల కోసం నిలబడతాను.. నేను మాట్లాడితే నన్ను ఎస్సీ, బీసీ, కాపులతో తిట్టిస్తారు.. రాజ్యాధికారం అనుభవించిన కులాలతో విమర్శలు చేయించరు అన్నారు పవన్‌.. ఇక, తెలంగాణలో కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారు. దీనిపై ఏపీ నుంచి ఎవ్వరూ మాట్లాడలేదు. ఏ బీసీ మంత్రి, ఏ బీసీ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు.. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తప్పిస్తే ధర్మాన, బొత్స లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడరు..? అని ప్రశ్నించారు. బొత్స పెరిగితే తూర్పు కాపులు పెరిగినట్టు కాదన్న ఆయన.. ఏపీ బీఆర్ఎస్ నేతలు దీనిపై స్పందించాలి.. సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారు.. దీనిపై బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలన్నారు.. సంఖ్యా బలం లేని ఎంబీసీల కోసం నేనేం చేయగలనో ఆలోచిస్తున్నాను అన్నారు పవన్.. రూ. 32 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని విమర్శించిన ఆయనన. 56 బీసీ కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేసి.. కారు స్టిక్కర్లకే పరిమితం చేశారని ఫైర్‌ అయ్యారు. మేం అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులో సగం పదవులు బీసీలకే ఇస్తామని ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌.