10th Student Dies: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని వీరులపాడు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని శీలం జాహ్నవి గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే, జాహ్నవి కంచికచర్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. కుటుంబంతో కలిసి కంచికచర్ల పట్టణంలోనే నివాసం ఉంటుంది. ఇటీవల గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న జాహ్నవిని తల్లిదండ్రులు నిన్న కంచికచర్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు వైద్యులు చికిత్స అందించారు.
Read Also: Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!
అయితే, ఇల్లు ఆసుపత్రికి సమీపంలోనే ఉండటంతో, కొద్దిసేపు ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి తిరిగి వస్తామని డాక్టర్కు చెప్పి తల్లిదండ్రులు జాహ్నవిని ఇంటికి తీసుకెళ్లారు. కానీ, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే బాత్రూంలో జాహ్నవి కుప్పకూలిపోయింది. వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన అదే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు సీపీఆర్ చేసి, అవసరమైన పరీక్షలు చేసిన అనంతరం గుండెపోటుతో జాహ్నవి మృతి చెందినట్లు నిర్ధారించారు. జాహ్నవి మృతితో వీరులపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
