విశాఖపట్నంలోని, రిషికొండలో చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణం రాజు వేసిన పిటిషన్ విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. విశాఖపట్నం సమీపంలోని రుషికొండ పై చేపట్టిన నిర్మాణాలపై పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు వస్తున్న ఆరోపణలపై నివేదికను కోరింది. ఈ మేరకు ఎన్జీటీ గతంలోఇచ్చిన కోర్టు తీర్పును గుర్తు చేసింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 17, 2021న జారీ చేసిన ఉత్తర్వులో, రుషికొండ పై అక్రమ నిర్మాణాలు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, CPCB, రాష్ట్రానికి చెందిన స్వతంత్ర నలుగురు సభ్యుల కమిటీని నియమించిందని తెలిపింది. దీనిపై PCB, SEIAA, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం జిల్లా మేజిస్ర్టేట్ను నివేదిక కోరింది. రెండు నెలల్లో ట్రిబ్యూనల్కు ఈ నివేదికను అందజేయాలని ఆదేశించింది. స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (SEIAA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుందని ఎన్జీటీ పేర్కొంది. ఈ కమిటీ రెండు వారాల్లో సమావేశం కావొచ్చని తెలిపింది.
అంతేకాకుండా ఈ కమిటీ సభ్యలు రిషికొండలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించవచ్చని , దానికి సంబంధించిన అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఈ కమిటీలకు ఉందని ఎన్జీటీ బెంచ్ పేర్కొంది. రఘురామ రాజు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి ప్రాంతాల (అభివృద్ధి) చట్టం 1975 ప్రకారం పట్టణాభివృద్ధి శాఖ నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్ను ఉల్లంఘించారని విచారణ సందర్భంగా ఎన్జీటీ పేర్కొంది. అయితే పిటిషన్ దారు ఈ ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనదని, పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం ద్వారా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నట్టు ఎన్జీటీ తెలిపింది.