NTV Telugu Site icon

Bheemla Nayak: థియేటర్ యాజమాన్యం కక్కుర్తి.. టిక్కెట్‌తో పాటు కూపన్ కొనాలంట

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. భీమ్లానాయక్ మూవీ విడుదల నేపథ్యంలో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని కొందరు థియేటర్ యజమానులు కక్కుర్తికి తెర తీశారు. నెల్లూరులోని స్పైస్ సినిమా థియేటర్ నిర్వాహకులు ప్రస్తుతం ఇదే పనిలో పడ్డారు. తమ థియేటర్‌లో భీమ్లా నాయక్ సినిమా చూడాలంటే సినిమా టిక్కెట్‌తో పాటు ఫుడ్ కూపన్ కూడా కొనాల్సిందేనని షరతు పెట్టారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా టిక్కెట్ కోసం వస్తే ఇదేం బాదుడు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. సినిమా టిక్కెట్‌ రూ.250 అని.. ఫుడ్ కూపన్ రూ.120 అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సినిమా టికెట్ కొన్నవాళ్లు టికెట్ తోపాటు ఫుడ్ కూపన్ కూడా వాట్సప్ గ్రూపుల్లో పెడుతూ థియేటర్ నిర్వాహకులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏపీ వ్యాప్తంగా థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా.. స్పైస్ థియేటర్ వారు ఇలా కూపన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తుండటం విచిత్రంగా ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.