కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ లేఖ రాశారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వచ్చే జీఎస్టీ మండలి భేటీలో వెనక్కి తీసుకోవాలని.. కరోనా కారణంగా పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
మరోవైపు చేనేత కళాకారులను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో ఉందని గుర్తుచేశారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడమే పెనుభారంగా మారగా.. ఇప్పుడు ఏకంగా దానిని 12 శాతానికి పెంచాలనుకోవడం చేనేత రంగానికి మరణశాసనమేనని నారా లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు. ముడి సరుకులపైనా 25 శాతం జీఎస్టీ విధించడంతో చేనేత పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని లోకేష్ పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయన్నారు.