NTV Telugu Site icon

Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా పెరిగిన వరద ఉధృతి.. 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేత..

Srisailam

Srisailam

Srisailam Dam: కృష్ణా నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది.. దీంతో.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి.. ఓవైపు జూరాల.. మరోవైపు తుంగభద్ర నుంచి వరద పోటెత్తడంతో.. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది.. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ఉధృతి పేరుగుతోన్న నేపథ్యంలో.. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 4,82,401 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 10 గేట్లు, విద్యుత్‌ ఉత్పత్తి కోసం మొత్తంగా 5,28,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇక, పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 207.4100 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. కుడి గట్టు, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Read Also: Paris Olympic: ఒలింపిక్స్ లో భారీ మోసం..అర్హత లేని బాక్సర్ ను బరిలోకి దింపిన వైనం

మరోవైపు.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను తాకింది నీటిమట్టం.. 545.80 అడుగులకు నీటిమట్టం చేరడంతో క్రస్ట్ గేట్లను తాకింది కృష్ణమ్మ.. జులై 23వ తేదీన 503 అడుగుల వద్ద.. 120.89 టీఎంసీల వద్ద సాగర్ నీటిమట్టం ఉంది.. తాజాగా 546 అడుగుల వద్ద.. 198 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. పది రోజుల్లో 43 అడుగుల నీటిమట్టం పెరగగా.. 78 టీఎంసీల నీరు వచ్చి చేరింది.. గడచిన 48 గంటల్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరిన 50 టీఎంసీల నీరు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.