చిత్తశుద్ధి లేకుండా చట్టాలు చేసి ప్రచారం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు మాత్రం రక్షణ ఇవ్వలేకపోతోంది.రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళా వలస కూలీపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరం అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. పొట్ట కూటి కోసం వలస వచ్చిన కుటుంబానికి ఎదురైన ఈ దిగ్భ్రాంతికర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్థితిని తెలియచేస్తోందని ఎద్దేవా చేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకొంటున్నా సీబీఐ దత్తపుత్రుడు… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించడం లేదు.బాధిత కుటుంబాలపైనే నిందలు వేసి తప్పించుకోవాలని ప్రభుత్వం చూడటం గర్హనీయం.
తుమ్మపూడి ఘటనలో పోలీసు అధికారుల తీరు ఇలాగే ఉంది. రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రకటనలు కూడా ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలకు తల్లులే కారణం.. వాళ్ళు సరిగా లేకపోవడమే కారణం అని చెప్పడం విచిత్రంగా ఉంది. రేపల్లె సామూహిక అత్యాచారానికి ఏ తల్లి తప్పు ఉంది..?విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి ఏ తల్లి తప్పిదమో బాధ్యత కలిగిన రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి స్పష్టం చేయాలి.విజయవాడ అత్యాచార ఘటనపై స్పందించిన తీరు చూశాక రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అవగాహనారాహిత్యం వెల్లడైంది. హోమ్ శాఖను, పోలీసులను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఫలితమే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం.చిత్తశుద్ధి లేకుండా చట్టాలు చేసి.. ప్రచారం చేసుకోవడం వల్ల ఏ ఒక్క ఆడ బిడ్డకు భరోసా లభించదు.
తాడేపల్లి ఇంటి నుంచి కదలని ముఖ్యమంత్రి.. ఒకసారి బయటకు వచ్చి బాధిత కుటుంబాలను పలకరిస్తే ఆడ పిల్లల తల్లితండ్రులలో ఉన్న భయాందోళనలు తెలుస్తాయి.రాష్ట్రంలోని కీచక పర్వాన్ని ఖండించే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల వారిని కట్టడి చేసి అరెస్టులు చేయడం మాని మహిళల రక్షణపై చిత్తశుద్ధిగా పని చేయండని హితవు పలికారు నాదెండ్ల మనోహర్.