హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన టీడీపి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో పాటు ప్రియాంక రెడ్డి అనే మహిళకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేష్కు పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే, మార్చి 16 (సోమవారం) నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రజాప్రతినిధిగా ఆయన సభకు హాజరుకావాల్సి ఉన్నందున, ఆ కారణాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. పుట్టా మహేష్తో పాటు అదే పార్టీలో పాల్గొన్న ప్రియాంక రెడ్డికి కూడా ఊరట లభించింది.
Vizag: ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మాణం..
ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి డ్రగ్స్ తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎంపీ స్థానంలో ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటని, పుట్టా మహేష్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కొద్దిరోజుల క్రితం మొయినాబాద్లోని ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈగల్ టీమ్ , ఎస్వోటీ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఎంపీతో పాటు మొత్తం ఎనిమిది మంది పట్టుబడ్డారు. అక్కడ భారీగా కొకైన్ , ఒక రివాల్వర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.