చేసిన అప్పులు ఎలా తీర్చాలో జగన్ కు తెలుసని , సీఎంగా వైఎస్ జగన్ 30 సంవత్సరాలపాటు అధికారంలో ఉంటారని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో నిన్న పర్యాటక, క్రీడ, సాంస్కృతి శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అప్పులు చేయలేదని, కరోనా సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీ కంటే ఎక్కువగానే అప్పులు చేశాయన్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో కూడా జగన్కు తెలుసునని వివరించారు.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, విస్తరించడం ద్వారా ఏటా రూ. 200 కోట్ల ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నెల చివరి వారంలో కానీ, లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కానీ పెట్టుబడిదారుల సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక స్థలాలు, ఆస్తులను లీజుకు తీసుకున్న వారి నుంచి రూ. 31.08 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, వాటిని త్వరలోనే వసూలు చేస్తామన్నారు. పర్యాటక సంస్థకు చెందిన 18 రెస్టారెంట్ల నిర్వహణకు 50 టెండర్లు వచ్చాయని, పరిశీలన అనంతరం వాటిని ఖరారు చేస్తామని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో కొత్తగా 8 క్రీడా పాఠశాలలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్నా అభివృద్ధిని చూడలేక వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.