కరోనా వైరస్తో ఇప్పుడు పరీక్షలు వాయిదా వేసినా.. పరిస్థితి అనుకూలించిన తర్వాత టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్న ఆయన.. ఇంటర్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.. అయితే, టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి.. ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం కూడా సంప్రదింపులు చేస్తోందని… ఈ పరీక్షల్లో వచ్చే మార్కులు రేపటి విద్యార్థి భవిష్యత్తుకు చాలా అవసరం అన్నారు. ఇక, చాలా మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు కూడా పరీక్షలు నిర్వహించాలని సూచించాయన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.. జేఈఈ, నీట్ వంటి పరీక్షలతో పాటు రాష్ట్రంలో నిర్వహించే ఎంట్రెన్స్ టెస్టులకూ మార్కులు అవసరం అని.. మనుగడ కోసం విమర్శలు చేయడం తప్ప వాళ్ళకి పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ లేదని మండిపడ్డారు.. రాజకీయాలు చేయడం ఆపి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు మంత్రి సురేష్.