Byreddy Siddharth Reddy: కర్నూలులో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ బహుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విమర్శలతో పాటు పలు అంశాలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. మంత్రి టీజీ భరత్ తనకు టికెట్ రాలేదని వ్యాఖ్యానిస్తున్నారని, “ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది” అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న సతీష్ కుటుంబానికి ఏ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు వచ్చాయో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే తాను చెప్పిన వెంటనే ఆ కంపెనీ నుంచి డబ్బులు ఇవ్వలేదని చెప్పిస్తారని ఆరోపించారు.
ఎన్నికల ముందు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆరోపణ అయినా నిరూపించారా అని ప్రశ్నించారు బైరెడ్డి.. “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమంలో తాను రూ.600 కోట్లు తిన్నానని ఆరోపించారని, కానీ ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో రూ.40 కోట్ల అక్రమాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఇక, బైరెడ్డి శబరిపై కూడా సిద్ధార్థరెడ్డి విమర్శలు గుప్పించారు. “బైరెడ్డి శబరి తండ్రిని వెస్ట్ ఫెలో అని గౌరు వెంకటరెడ్డి అన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే అయి ఏమి చేశాడని మాండ్ర శివానందరెడ్డి విమర్శించినప్పుడు శబరి ఎందుకు స్పందించలేదు?” అని ప్రశ్నించారు.
శబరి తండ్రి ఆమెకు ఎంబీబీఎస్, పీజీ సీట్లు కొనిచ్చారని, అలాంటి తండ్రిపై విమర్శలు వచ్చినా ఆమె స్పందించడం లేదన్నారు. అలాగే టీజీ వెంకటేష్ గౌరవం కోల్పోయారని, అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు బైరెడ్డి.. మీసాలు తిప్పుకుని తిరిగేవాళ్లు మీసాలు దించుకుని మీ దగ్గరకు ఎవరు వచ్చారో చెప్పాలి అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. “కష్టమో, నష్టమో నేను నిలబడతా. నా దగ్గర రూపాయి ఆస్తి లేదు. నాకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే” అంటూ వ్యాఖ్యానించారు. అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో కొందరు టచ్లో ఉన్నారని, రేపు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తమను కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన కామెంట్లు చేశారు..
