పేదలంటే సీఎం జగనుకు విద్వేషం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు మంచి ఇళ్లల్లో ఉండటం సీఎం జగనుకు ఇష్టం లేదని, ఉగాది నాటికి ఎంతమంది పేదలను కొత్త ఇళ్లలోకి పంపుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క పునాది కూడా తవ్వకుండా పేదలు కోరుకున్న ప్రభుత్వమే ఇల్లు కట్టించాలన్న 3వ ఆప్షన్ నుంచి వెనక్కి తగ్గుతున్నారన్నారు.
ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టకపోగా, చంద్రబాబు హయాంలో నిర్మించిన వాటిని కూడా పేదలకు దక్కకుండా చేశారని ఆయన ఆరోపించారు. నివాస యోగ్యం కాని చోట్ల పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు రూ. 5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. వైసీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అవినీతిని ప్రశ్నించిన వారిపై వైసీపీ దాడులకు దిగుతోందని ఆయన మండిపడ్డారు.