Cyber Fraud: కాకినాడలో ఆన్లైన్లో కొనుగోలు చేసిన పెసర పప్పు ధర ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి లక్షలాది రూపాయాలు మాయం అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి హనుమంతరావు ఆన్లైన్ యాప్లో పెసరపప్పు ఆర్డర్ చేశారు. ఆర్డర్ సమయంలో ధర రూ.53గా చూపించగా, డెలివరీ సమయంలో బిల్లులో మాత్రం రూ.111 వసూలు చేసినట్లు తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేయాలని భావించిన ఆయన, డెలివరీ బాయ్ వద్ద నుంచి మేనేజర్ నెంబర్ తీసుకుని కాల్ చేశారు. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడడంతో కాల్ కట్ చేశారు. ఆ తర్వాత అదే నెంబర్ నుంచి ఆరు సార్లు కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయలేదని చెప్పారు. కానీ, కొద్ది సేపటికి తన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం రూ.5 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్లు వచ్చాయని బాధితుడు వెల్లడించారు. వెంటనే బ్యాంకుకు వెళ్లి విచారణ చేయగా, ఇది సైబర్ మోసం అని నిర్ధారణ అయింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
– తెలియని నంబర్లకు వ్యక్తిగత/బ్యాంక్ వివరాలు చెప్పకండి
– OTPలు, లింకులు ఎవరితోనూ షేర్ చేయకండి
– ఫిర్యాదుల కోసం అధికారిక కస్టమర్ కేర్ నంబర్లు మాత్రమే ఉపయోగించండి
– అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంక్కు సమాచారం ఇవ్వండి
– 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయండి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి
ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని పోలీసు అధికారులు సూచిస్తున్నారు..