ఏపీలో రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం నిధులను మంగళవారం జగన్ విడుదల చేశారు. వర్చువల్ పద్ధతిలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
మూడో ఏడాది రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 50.37 లక్షల మంది రైతులకు రూ.2,051.71 కోట్ల నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 2020 ఖరీఫ్లో రుణాలు తీసుకున్న6.67 లక్షల రైతులకు రూ.112.7 కోట్ల నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఇవే కాకుండా వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రాష్ట్రంలో 1720 రైతు సంఘాలకు వ్యవసాయ పరికరాల కొనుగోలుకు రూ.25.55 కోట్ల రాయితీ నిధులను విడుదల చేసినట్టు సీఎం జగన్ తెలిపారు.