తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. నేడు షార్ వేదికగా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డీ1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి ఇప్పటికే కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. ఎస్ఎస్ఎల్వీ సిరీస్లో తొలి రాకెట్ ఇస్రో భూ పరిశీలన ఉపగ్రహం మైక్రోశాట్-2ఏతోపాటు దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జి ఇండియా సంస్థ తయారు చేయించిన ఆజాదీ శాట్తో రోదసీలోకి దూసుకుపోనుంది. ఈ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగాన్ని ఇస్రో వైపు తిప్పేందుకు మన శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆజాదీశాట్ ఉపగ్రహాన్ని దేశంలోని 75 పాఠశాలలకు చెందిన విద్యార్ధినుల విజ్ఞానంతో సైంటిస్టులు రూపొందించడం విశేషం.
Read Also: Lightning Strike: చమురు నిల్వ కేంద్రంలో పిడుగు.. 80 మందికి గాయాలు, 17మంది మిస్సింగ్
కాగా ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ను ప్రయోగించేందుకు షార్ సైంటిస్టులు శనివారం ఉదయం 11 గంటలకు వాహన సంసిద్ధత సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించారు. తిరువనంతపురం వీఎస్ఎస్సీ సెంటర్ శాస్త్రవేత్త ఈఎస్ పద్మకుమార్ అధ్యక్షతన సమావేశమైన శాస్త్రవేత్తలు ప్రయోగ రిహార్సల్స్లో నమోదైన రాకెట్ పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. అనంతరం శనివారం సాయంత్రం షార్ డైరెక్టర్ రాజరాజన్ అధ్యక్షతన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడు గంటల పాటు కౌంట్డౌన్ నిర్వహించారని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించారు. అటు ఈ రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకునేవారికి ఇస్రో అద్భుత అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను షార్ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మూడు రోజుల కిందట సూచించగా భారీ స్పందన లభించింది.