YS Jagan Guntur Visit: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ గుంటూరు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న వైఎస్ జగన్, ఉదయం 11 గంటలకు గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పనున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు నివాస సమీపంలో దాడికి గురైన వైసీపీ కార్యాలయాన్ని కూడా జగన్ పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ నేతలతో పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు నుంచి తిరుగు ప్రయాణమై, మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి లోని తన నివాసానికి వైఎస్ జగన్ చేరుకోనున్నారు. ఇటీవల గుంటూరులో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.