Attack on Ambati Rambabu House: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు తన న్యాయవాది ద్వారా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దాని ఆధారంగా మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులో టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తన నివాసంపై దాడి చేసి కార్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పట్టాభిపురం పోలీసులు BNS సెక్షన్లు 127(2), 189(2), 324(4), 329(4), 351(2) r/w 190 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దాడి ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు, సంబంధిత ఆధారాలను సేకరిస్తున్నారు.
Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్కు బిగ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
ఇక, మరోవైపు, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబును పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ నల్లపాడు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నేడు గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబుపై పలు కేసులు నమోదయ్యాయి. కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతిస్తే, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబును విచారణ నిమిత్తం నల్లపాడు పోలీసులు గుంటూరుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది.