Andhra Pradesh: ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని గ్రామ పంచాయతీ ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు పీఆర్ కమిషనర్కు సీఐటీయూ అనుబంధ పంచాయతీ ఉద్యోగుల సంఘం నోటీసులు పంపింది. తొమ్మిది ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసు జారీ చేసింది. బకాయి జీతాలు వెంటనే చెల్లించి కార్మికుల కుటుంబాలను కాపాడాలని, పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు కనీస వేతనం నెలకు రూ.20 వేలు చెల్లించాలని, మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా నెలకు రూ.6 వేలు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ వర్తింపజేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
Read Also: Atrocious Incident: కారుణ్య ఉద్యోగం కోసం దారుణం.. మామను ట్రాక్టర్తో గుద్ది చంపిన అల్లుడు..
అంతేకాకుండా పంచాయతీ కార్మికులకు 2015లో హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలని, కార్మికుల తొలగింపులు ఆపాలని, జీవో 551 రద్దు చేయాలని, జీవో 132ను అన్ని స్థాయిల్లో అమలు చేయాలని, బకాయి జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, సర్పంచ్, అధికారుల వేధింపులు నివారించి ఉద్యోగ భద్రత కల్పించాలని రక్షణ పరికరాలు, యూనిఫాం వంటివి సకాలంలో అందించాలని, ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షలు, సాధారణ మృతికి రూ.5 లక్షలు ఇవ్వాలని, ఇళ్లు, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని సమ్మె నోటీసుల్లో గ్రామ పంచాయతీ ఉద్యోగులు పేర్కొన్నారు.