ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించేందుకు సిద్ధమైంది. 9నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులకు అమ్మఒడి పథకంలో ఇచ్చే డబ్బుకు బదులుగా ల్యాప్టాప్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వేళ ఆన్లైన్ చదువులు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం పిల్లల చదువు కోసం ఆర్ధిక సహకారం కింద జగన్ సర్కార్ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తోంది. నవ రత్నాల్లో భాగంగా ఈ పథకం అమలవుతోంది. అమ్మఒడి కింద అర్హులైన విద్యార్ధులకు ఏడాదికి 15వేల రూపాలయ ఆర్దిక సహాయం చేస్తోంది. ఈ మొత్తం విద్యార్ధి తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి కరోనా వల్ల ఆన్లైన్ చదువులకు ప్రాధాన్యత, ఆవశ్యకత ఏర్పడింది.
ఆన్ లైన్ విద్యా విధానాన్ని విద్యార్ధులు అందిపుచ్చుకుని మరింతగా ముందుకు వెళ్లాలంటే ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు కీలకం అని భావించిన ప్రభుత్వం అమ్మఒడి కింద ఇస్తున్న మొత్తాన్నే ల్యాప్ టాప్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. అమ్మఒడి పథకంలో భాగంగా 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థుల కోసం ల్యాప్ టాప్ లు అందించేందుకు సిద్ధమైంది. నగదు తీసుకోవాలా లేక ల్యాప్ టాప్ తీసుకోవాలా అన్న ఆప్షన్ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకే వదిలేసింది. ల్యాప్ టాప్ కావాలని ఆప్షన్ ఎంచుకున్న వారికి ప్రభుత్వమే అందిస్తుంది. 9 నుంచి 12 వ తరగతి చదివే విద్యార్ధులకు ఈ ఆప్షన్ కింద ల్యాప్టాప్ను ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.
అమ్మఒడి పథకం కింద డ్యుయెల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 ఇంచుల స్క్రీన్, విండోస్ 10 ఎస్టీఎఫ్ మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఆఫీస్ల కాన్ఫిగరేషన్తో ల్యాప్టాప్లు అందించనున్నారు. ఈ ల్యాప్టాప్లకు మూడేళ్ల వారెంటీ ఉంటుంది. ల్యాప్టాప్లకు మెయిన్టెనెన్స్ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి ప్రభుత్వం షరతు విధించింది. ఏవైనా సమస్యలు తలెత్తితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్ధులకు ఉచిత ల్యాప్టాప్లు ఇచ్చే యోచనలో ఉంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు 60 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో కేంద్రం వాటాగా 36వేల 473 కోట్ల రూపాయలుగా ఉండనుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాలి. ఇందులో 2021-22 విద్యా సంవత్సరంలో 1.5 కోట్ల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వాలనేది కేంద్ర ప్రణాళిక.