ఏపీ ప్రభుత్వం ఇటీవల డీజీపీ ఉన్న గౌతమ్ సవాంగ్ను ఏపీపీఎస్సీ చైర్మన్గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు బదిలీపై వెళుతున్న గౌతమ్ సవాంగ్కు పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 36 ఏళ్ళ నా పోలీసు సర్వీస్ ముగింపుకు వచ్చిందని ఆయన అన్నారు. రెండేళ్ళ 8 నెలల పాటు రాష్ట్ర డీజీపీగా పని చేసే అవకాశం ముఖ్యమంత్రి ఇచ్చారని, అందుకు సీఎం కు కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు బాసటగా నిలబడే విధంగా పోలీసు పనితీరు, మైండ్ సెట్ మార్చేందుకు కృషి చేశానని ఆయన వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని పోలీసు సామర్థ్యం పెరిగేందుకు పని చేశానన్నారు.
స్పందన, సైబర్ మిత్రా, దిశ యాప్ వంటి విధానాల ద్వారా బాధితులు భౌతికంగా పోలీస్ స్టేషన్ రానవసరం లేకుండా చేశామని ఆయన తెలిపారు. 36 శాతం ఫిర్యాదులు సాంప్రదాయేతర విధానంలో నమోదు అయ్యాయని, మహిళలు, పిల్లల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పని చేశామన్నారు. కోటి దిశ యాప్ డౌన్ లోడ్లను ముఖ్యమంత్రి లక్ష్యంగా పెడితే మేము కోటి పది లక్షల డౌన్ లోడ్ లు చేయగలిగామన్నారు. దేశంలోనే భద్రతా యాప్లలో అత్యధికంగా డౌన్ లోడ్ అయిన యాప్.. దిశ యాప్ అని తెలిపారు. అయితే నేడు నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.