Gannavaram to Shirdi: షిర్డీ సాయిబాబాను దర్శించుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు.. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు బస్సులు, రైళ్లలో మాత్రమే షిర్డీకి వెళ్లే అవకాశం ఉంది.. త్వరలోనే విమానాల్లో కూడా షిర్డీ వెళ్లే అవకాశం దక్కనుంది.. విజయవాడ సమీపంలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.. మార్చి 26వ తేదీ నుంచి ఈ సర్వీసులు స్టార్ట్ కాబోతున్నాయట.. ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ముందుకు రావడంతో పాటు ప్రయాణ షెడ్యూల్ను కూడా ప్రకటించడంపై సాయి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Jeevan Reddy : ప్రీతి కేసులో.. సిట్ విచారణ.. సిట్టింగ్ జడ్జితో జరపాలి
ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఏటీఆర్ 72-600 విమానం.. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ రోజు మధ్యాహ్నం 12.25 గంటలకు బయల్దేరుతుంది.. అది మధ్యాహ్నం 3 గంటలకు షిర్డీ చేరుకోనుంది.. ఇక, షిర్డీ నుంచి ఏపీకి రావాల్సిన ప్రయాణికుల కోసం నడిపే మరో విమానం.. ప్రతీ రోజు మధ్యాహ్నం 2.20 గంటలకు షిర్డీ నుంచి బయల్దేరి.. సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. ఇక, విమాన టికెట్ ధరను కూడా ప్రకటించింది ఇండిగో.. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టికెట్ ధర రూ.4,246గా ఉండగా.. షిర్డీ నుంచి గన్నవరంకు రూ.4,639గా నిర్ణయించారు. రైళ్లు, బస్సుల్లో నానా ఇబ్బందులు పడి షిర్డీ వెళ్తున్న భక్తులు.. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. త్వరగా షిర్డీకి వెళ్లే సౌకర్యం రానుండడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు