YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు

Gudivada Amarnath

Gudivada Amarnath

YS Jagan Security: తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాల్సిన మాజీ ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద భారీగా ప్రజలు చేరుకున్నప్పటికీ వారిని నియంత్రించేందుకు తగిన భద్రతా సిబ్బంది లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని ఆయన ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్న విషయం తెలిసినా సరైన భద్రత కల్పించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఏపీ డీజీపీకి తాను నాలుగు సార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. నిన్న సాయంత్రం వరకు పోలీసు బందోబస్తు, ఇతర భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఈ ఉదయం అవి కనిపించకుండా పోవడం వెనుక కుట్ర ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే దాని బాధ్యతను జగన్‌పైనే మోపేలా పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. చివరకు పార్టీకి చెందిన యువ వాలంటీర్లను నియమించి జగన్ పర్యటనను సురక్షితంగా పూర్తి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా రాష్ట్ర డీజీపీపై విమర్శలు గుప్పించారు. పోలీసు వ్యవస్థ నిష్పాక్షికంగా వ్యవహరించాలని, లేకపోతే యూనిఫాం తీసి ఎల్లో యూనిఫాం వేసుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.