ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో కొత్త దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి బయటకు వస్తున్న సమయంలో మంత్రిని చూడగానే ఒక్కసారిగా భక్తులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో మంత్రి దర్శనానికి రావడంతో అధికారులు గంటల తరబడి స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు మంత్రి కొట్టు సత్యనారాయణ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని పలువురు మండిపడ్డారు. మంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. భక్తుల ఆగ్రహాన్ని గమనించిన మంత్రి కొట్టు సత్యనారాయణ స్వయంగా భక్తుల వద్దకు వచ్చి సర్దిచెప్పారు. మంత్రి జోక్యంతో అధికారులు వెంటనే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.