Intermediate Exams: ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడింది.. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయి.. అయితే, ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు తగిన ఫస్ట్ ఎయిడ్ కిట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. 20-25 పరీక్షా కేంద్రాలకు కలిపి ఒక 108 అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ఆయా రూట్లలో తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు సీఎస్.
Read Also: Breast Cancer : రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను తెలుసుకోండి
ఇక, పరీక్షలు జరిగే సమయంలో ప్రశ్నాపత్రాలు లీకేజి లేదా మాల్ ప్రాక్టీస్ వంటి వదంతులు సృష్టించి విద్యార్థులను ఆందోళనలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి.. అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు సీఎస్ జవహర్ రెడ్డి. జిల్లా, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల పరిధిలో పరీక్షలు జరిగే తేదీల్లో జిరాక్స్ కేంద్రాలు, ఫొటో కాపీయింగ్ కేంద్రాలను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. అదే విధంగా పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. అంతేకాకుండా తగినన్ని మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా పరీక్షలు జరిగే సమయంలో ఆయా పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇందుకుగాను ప్రత్యేకంగా ఒక నోడలు అధికారిని నియమించి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో సమన్వయం కలిగి ఉండేలా చూడాలన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల పటిష్ట నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులతో జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీల స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.. కాగా, 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు రాష్ట్రంలో మొత్తం 10 లక్షల 3వేల 674 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారిలో 4 లక్షల 84 వేల 12 మంది మొదటి సంవత్సరం పరీక్షలకు.. 5 లక్షల 19 వేల 662 మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారు.. ఇక, పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,489 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.