కేంద్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఐ ఆందోళన చేపట్టింది. బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. సీపీఐ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి మొండిచేయి చూపించారన్నారు. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదని ఆయన అన్నారు.
రైల్వేస్ పరంగా ఏపీకి ఎటువంటి కేటాయింపులు లేవని ఆయన మండిపడ్డారు. ప్రధాని హోదాలో మోడీ రైల్వే జోన్ పై విశాఖలో హామీ ఇచ్చారని, ఓఎస్డీని పెట్టి మూడేళ్లవుతున్నా ఎటువంటి కేటాయింపులు లేకుండా తాత్సారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కార్పొరేట్ రంగానికి అనేక రాయితీలు ఇచ్చారు కాబట్టే నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పరుగులు పెట్టిందని ఆయన అన్నారు. రైల్వేజోన్ కి సంబంధించి కలిసొచ్చే వారందరితో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన వెల్లడించారు.