AP CM Jagan: పేదలే కాకుండా ఎక్కడ ఎటువంటి వైద్య సహాయం వచ్చి రవాణా కోసం ఎదురు చూసే వారికి 108 అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అంబులెన్స్ సేవలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నాయి. అంబులెన్స్ సేవలు నిరుపేదలతోపాటు ప్రమాదాల బారిన పడిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా.. ప్రమాదాల సమయంలో త్వరగా అక్కడికి చేరుకొని వారికి ప్రధమ చికిత్సను అందించి.. మెరుగైన వైద్యం కోసం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలను కాపాడుతోంది. అటువంటి 108 అంబులెన్స్ ల సంఖ్యను పెంచాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం సోమవారం కొత్తగా 146 అంబులెన్స్ లను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 146 కొత్త 108 అంబులెన్స్లను ప్రారంభించారు. ఇప్పటికే కొనసాగుతున్న అంబులెన్స్ లకు అదనంగా మరో 146 అంబులెన్స్ లను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ ఈరోజు కొత్తగా 146 అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు విడదల రజని, ఉషాశ్రీ చరణ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబులెన్స్లను సీఎం జగన్ పరిశీలించారు. 2,50,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి తరచూ మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్స్ల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 34.79 కోట్లను ఖర్చు చేసి ఈ కొత్త అంబులెన్స్లను తీసుకొచ్చింది.
Read also: Mohan Lal: ఏక్తా కపూర్ తో మలయాళ సూపర్ స్టార్ మీటింగ్ కి కారణం ఏంటి?
2019లో కేవలం 531 అంబులెన్స్లు ఉపయోగంలో ఉన్నాయి. వాటిలో 336 అంబులెన్స్లు మాత్రమే పనిచేసే స్థితిలో ఉన్నాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేయాలని ఆదేశించారు. 2020లో 412 కొత్త అంబులెన్స్లను తీసుకొచ్చామని.. 26 నవజాత శిశువుల అంబులెన్స్లతో కలిపి మొత్తం అంబులెన్స్ల సంఖ్య 748కి చేరుకుందని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ప్రాణాలను రక్షించే పరికరాలతో సహా అంబులెన్స్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం దాదాపు రూ. 96.50 కోట్లను వెచ్చించిందని ఆయన తెలిపారు.