ఏపీ సీఎం జగన్కు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో… నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసే జిల్లాకు గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు జిల్లాగా పేరు పెట్టాలని లేఖలో కోరారు. పార్లమెంట్ నియోజకవర్గాల తరహాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
Read Also: ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేదు: పీఆర్సీ సాధన సమితి
ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నిర్ణయమని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో మెరుగైన పరిపాలన, వేగవంతమైన, సమతుల్య అభివృద్ధి కోసం వీలైనంత త్వరగా అమలు చేయాలని జీవీఎల్ తన లేఖలో పేర్కొన్నారు. గొప్ప చరిత్ర, సంప్రదాయం కలిగిన పల్నాడు ప్రాంతానికి నరసరావుపేట ముఖ ద్వారం కాబట్టి… నరసరావుపేట కేంద్రంగా గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ కోరారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఈ జిల్లా గొప్ప చరిత్ర, సాంస్కృతిక గుర్తింపుకు తగిన గుర్తింపుగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలోని వెనుకబాటు, అభివృద్ధి అవసరాలపై ఈ జిల్లా దృష్టి సారిస్తుందని జీవీఎల్ తన లేఖలో పేర్కొన్నారు.