Delhi Liquor Scam Case: సిసోడియా తరహాలోనే కవిత అరెస్ట్..! మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Vivek

Vivek

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. తప్పుడు కేసులు బనాయించి ప్రజాప్రతినిధులను, నేతలను వేధింపులకు గురిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.. అయితే, ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అరెస్ట్‌ కావడం కలకలం రేపుతోంది.. అయితే, ఈ కేసులో సంచలన వాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ నేత, మాజీ ఎంపీ వివేక్.. ఇవాళ తిరుమలలో శ్రీవారి దర్శించున్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్‌ అవుతారని తెలిపారు.. మనీష్‌ సిసోడియా తరహాలోనే కవిత కూడా త్వరలోనే అరెస్ట్‌ అవుతారని వ్యాఖ్యానించారు.

Read Also: Dharmapuri Srinivas : అస్వస్థతకు గురైన డీఎస్‌.. సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరిక

ఇక, పంజాబ్, గుజరాత్ ఎన్నికల సమయంలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎమ్మెల్సీ కవిత 150 కోట్ల రూపాయలు చెల్లించిందని ఆరోపణలు గుప్పించారు మాజీ ఎంపీ వివేక్.. తెలంగాణలో వ్యతిరేకతను ప్రక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీగా మారారన్న ఆయన.. తెలంగాణలో అక్రమంగా సంపాదించిన డబ్బులును దేశవ్యాప్తంగా.. బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖర్చ చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు.. బీఆర్‌ఎస్‌లో చేరికలపై కామెంట్‌ చేస్తూ.. మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్‌లోనూ అవుట్‌డేటెడ్‌ నాయకులే బీఆర్ఎస్‌లో చేరుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ వివేక్.. కాగా, సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఇప్పటికే కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించిన విషయం విదితమే. సీఆర్పీసీ 160 కింద కవితకు నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు.. ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు.. అప్పడికే ఆ కేసులో అరెస్ట్‌ అయిన కొందరు నిందితులు రిమాండ్ రిపోర్టులో చెప్పిన వివరాల ఆధారంగా కవితను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.