ప్రభుత్వానికి మాట తప్పే జబ్బు.. మనస్సు మార్చుకునే జబ్బు వచ్చిందని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ కరోనా జబ్బు మమ్మల్నేం చేయలేదని, ప్రభుత్వానికి వచ్చిన జబ్బు కంటే కరోనా ఏం పెద్ద జబ్బు కాదని ఆయన వ్యాఖ్యానించారు. హడావుడిగా జీతాలు వేసేశారని, చనిపోయిన వారికీ జీతాలు వేసేశారని ఆయన అన్నారు. సీఎఫ్ఎంఎస్ తీసేయాలన్న మంత్రి బుగ్గన ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా మాకు జీతాలు వేస్తున్నారని, ఈ ప్రభుత్వానిదంతా రివర్సేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం దొంగ పే-స్లిప్పులని ఇచ్చింది.. వాటిని తగులబెట్టామని ఆయన అన్నారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగుల జీతాల విషయంలో కోర్టులతో సహా అందర్నీ ప్రభుత్వం మభ్య పెడుతోందని ఆయన అన్నారు.
పే-స్లిప్పులను అగ్గి మంటల్లో తగులబెట్టలేదు.. కడుపు మంటతో తగులబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం కాకుండా సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు వేయడం సాంకేతికంగా చెల్లదన్నారు. మా రహస్య కోడ్ ను తస్కరించి జీతాలు వేశారని, మా కోడ్ తెఫ్ట్ జరిగిందని ఉద్యోగులంతా ఫిర్యాదులు చేస్తే ప్రభుత్వం ఏమవుతుంది..? ఆయన ప్రశ్నించారు. వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. జీతాలు పెరిగాయో.. లేదో ఉద్యోగులకు తెలీదా..? తామే తెలివైన వాళ్లన్నట్టుగా ఐఏఎస్సులు వ్యవహరిస్తున్నారు. మేం అంత అమాయకులమా..? ఏం తెలియకుండానే మేం ఇన్నాళ్లూ పని చేశామా..? ఘర్షణ వాతావరణం తొలగించేలా ప్రభుత్వ పెద్దల చొరవ తీసుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు.