ఏపీలో చింతామణి నాటకంపై నిషేధం వివాదాస్పదం అవుతోంది. నర్సాపురం ఎంపీ రఘురామ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ మండిపడుతున్నారు. సుబ్బిశెట్టి పాత్రను వికృతంగా చిత్రీకరిస్తున్నారని అందుకే చింతామణి నాటకంపై నిషేధం విధించారన్నారు కార్పోరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. దీనికి రఘురామ ఏంచెబుతారంటూ నిలదీశారు.
ఇటీవల ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించడం తెలిసిందే. ఆర్యవైశ్య సంఘాల డిమాండ్ ను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చింతామణి నాటకాన్ని నిషేధించడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర తీసివేసి, పేరు మార్చుదామని ఎంపీ రఘురామ చెప్పడం విడ్డూరంగా ఉందని కుప్పం ప్రసాద్ అన్నారు. ఆర్యవైశ్యులు మీ జోలికి రాలేదు… మా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోం అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆర్యవైశ్యుల మనోభావాలను గౌరవించి ఎంపీ రఘురామ తన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.