పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగాన్ని, ముఖ్యంగా రొయ్యల సాగుదారులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. గత ఏడాది అమెరికా విధించిన సుంకాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులకు, ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో భారీ దెబ్బగా మారాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా, అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు అమాంతం పడిపోయి రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
PM Modi: తృణమూల్ అహంకారం ముక్కలవుతుంది.. మమతా సర్కార్పై ప్రధాని ఫైర్..
గత నాలుగైదు రోజులుగా రొయ్యల ధరలు కేజీకి ₹30 నుండి ₹40 వరకు పతనమవ్వడంతో, ఒక్కో టన్ను పట్టుబడిపై రైతుకు సుమారు ₹40,000 వరకు నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా 30 కౌంట్ రొయ్యల ధర ₹510 నుండి ₹470కి, 40 కౌంట్ ధర ₹410 నుండి ₹360కి పడిపోవడం సాగుదారులను కోలుకోలేని దెబ్బ తీసింది.
మార్కెట్లో ఒకవైపు ధరలు తగ్గుతుంటే, మరోవైపు సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. మేత (Feed) ధరలు, విద్యుత్ ఛార్జీలు, కూలీల ఖర్చులు పెరగడంతో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
Prize Money: ఫైనల్లో గెలిచిన జట్టుపై కాసుల వర్షం.. మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే?
దీనికి తోడు మార్కెట్లో ఏ చిన్న అనిశ్చితి ఏర్పడినా ప్రాసెసింగ్ యూనిట్లు , ఏజెంట్లు ‘సిండికేట్’గా ఏర్పడి ధరలను కావాలనే తగ్గిస్తున్నారని, యుద్ధం నెపంతో ట్రేడర్లు తమను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన సీడ్ (Seed) లభించకపోవడం, వైరస్ వ్యాధుల ముప్పు కూడా తోడవ్వడంతో ఆక్వా రంగం అస్తవ్యస్తంగా మారింది.
నిజానికి కరోనా కాలం నుండి ఆక్వా రంగం వరుస విపత్తులను ఎదుర్కొంటూనే ఉంది. మొదట రవాణా ఆటంకాలు, ఆపై అమెరికా ఆంక్షలు, ప్రకృతి వైపరీత్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా రైతులను దెబ్బతీశాయి. ఇప్పుడు తాజాగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎగుమతి నౌకలు నిలిచిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలతో చర్చలు జరపాలని, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని ఆక్వా సాగుదారులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అప్పుల బాధ తాళలేక వేలాది కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.