Ganja: ఏపీలో భారీగా గంజాయి దహనం.. దేశచరిత్రలో ఇదే తొలిసారి

భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఏపీ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనున్నారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలను ధ్వంసం చేసి.. గంజాయి సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది.

అనేక దశాబ్దాలుగా ఏవోబీతో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో పట్టుబడిన రెండు లక్షల కిలోల గంజాయిని శనివారం నాడు దహనం చేయనుంది. ఈ గంజాయి విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ గంజాయి దహనం కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఓ ఈవెంట్‌లా నిర్వహించబోతోంది. దీని కోసం టెంట్లు, స్పీకర్లు, డ్రోన్ కెమెరాలు వాడుతోంది.