ఆంధ్రప్రదేశ్లోని మండల పరిషత్, జిల్లా పరిషతుల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం… గతంలో ప్రకటించిన ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. మరో ఆరు నెలల ప్రత్యేక పాలన కొనసాగుతుందంటూ వెల్లడించింది ఏపీ సర్కార్.. ఏప్రిల్ 8న మండల, జిల్లా పరిషత్లకు ఎన్నికలు పూర్తయినప్పటికీ, హైకోర్టు ఆదేశం కారణంగా ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. తాజాగా తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఏపీ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.. జూలై 5 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఏపీలో పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆ ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో స్థానిక సంస్థల పాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. ఇక, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే కొనసాగుతూ వచ్చింది.. కొంత కాలం ఎన్నికల నిర్వహణ విషయంలో.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య వివాదం నడవగా.. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించినా.. కౌంటింగ్పై కోర్టులో విచారణ సాగుతోన్న సంగతి తెలిసిందే.