యాస్ తుఫాను పై స్పందించిన ఏపీ విపత్తు నిర్వహణ శాఖ స్పందించింది. ఐఎండి సూచనల ప్రకారం… తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా కొనసాగుతున్న యాస్.. ఆ తరువాత 24 గంటల్లో అతితీవ్ర తుఫానుగా మారనుంది. పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ దీవులు) కు ఉత్తరాన వాయువ్య దిశలో 620 కిలోమీటర్లు, పారాదీప్ (ఒడిశా) కి 530 కిలోమీటర్లు, బాలసోర్ (ఒడిశా) కి ఆగ్నేయంగా 630 కి.మీ, దిఘా (పశ్చిమ బెంగాల్) కి ఆగ్నేయంగా 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అవుతుంది. ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ పారాదీప్ మరియు సాగర్ ద్వీపాల మధ్య మే 26 మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది.
దాంతో ఈరోజు, రేపు అక్కడక్కడ ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుంది. సముద్రంలో అలలు 2.9 – 4.5 మీటర్ల ఎత్తులో ఎగసి పడతాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదు అని సూచించింది. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొన్నారు.