CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని పలు కీలక శాఖలకు చెందిన మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం.
కాగా, ఈ రోజు జరుగుతున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలోనే ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును భారతీయ జనతా పార్టీ ఖరారు చేయనుంది. ఆ తర్వాత ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఈనెల 21వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, అలాగే, కీలక నేతలు హాజరు కానున్నారు. ఇక, ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి ముందుగా 20వ తేదీన ఎన్డీయే నేతల భేటీ జరగనుంది. ఆ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.