పీఆర్సీపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారిని నిర్భంధించే చర్యలు మానుకోవాలి. ముందస్తు నోటీసులిచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఉద్యోగ సంఘాలను నిర్భందించడం అంటే జగన్ తనను తానే నిర్భందించుకున్నట్లు అని ఆయన అన్నారు.
ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మాటల యుద్దం మంచిది కాదు. ఈ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు… అప్పుల కోసం తిప్పలు పడే పరిస్థితి. మూల ధనం పెంచుకోవడంపై జగన్ దృష్టి సారించాలి. ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రభుత్వం వద్ద అజెండా లేదు. ఏపీలో ప్రత్యామ్నాయంగా బీజేపీనే చూస్తున్నారన్నారు. ఇసుక ధర విషయంలో ప్రభుత్వం లెక్కలు అర్ధం కాకుండా ఉన్నాయి. ఇసుక రూపంలోనే రూ. 5 వేల కోట్ల ఆదాయం వస్తుంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే గనులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయి. ఎర్ర చందనం అమ్మకంతో రూ. 3 వేల కోట్ల అదాయం వస్తుంది. కానీ ఇవన్నీ రాజకీయ కోణంలో దోచుకోవడమే తప్ప… ప్రభుత్వానికి చేరడం లేదని ఆయన అన్నారు. చీమకుర్తి గనులు గతంలో ఎవరి ఆధీనంలో ఉండేవి.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి..? అని ఆయన ప్రశ్నించారు.