దేశంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా శృంగారం చేస్తున్నారు. ఒకరి కంటే ఎక్కువ మందితో శృంగారం చేసే విషయంలో చాలా మంది కండోమ్ లేకుండా ఈ కార్యంలో పాల్గొంటున్నారు. దీంతో హెచ్ఐవీ అనేది కామన్ డిసీజ్గా మారిపోయింది. దేశవ్యాప్తంగా అరక్షిత లైంగిక సంపర్కంతో గత పదేళ్లలో 17.08 లక్షల మంది హెచ్ఐవీ బారిన పడినట్లు తాజాగా ఎయిడ్స్ నివారణ సంస్థ వెల్లడించింది. ఎయిడ్స్ కేసులకు సంబంధించి మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఎయిడ్స్ నివారణ సంస్థ ఈ మేరకు బదులిచ్చింది.
గడిచిన పదేళ్లలో అంటే 2011-21 మధ్య కాలంలో భారత్లో 17 లక్షల 8 వేల 777 మందికి హెచ్ఐవీ సోకినట్లు ఎయిడ్స్ నివారణ సంస్థ తెలిపింది. అయితే దశాబ్ద కాలంగా ఎయిడ్స్ బారిన పడేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు సదరు సంస్థ వివరించింది. అరక్షిత లైంగిక సంపర్కం కారణంగా 2011-12లో 2.4లక్షల మందికి హెచ్ఐవీ సోకగా.. 2020-21లో ఆ సంఖ్య 85,268గా ఉన్నట్లు తెలిపింది. గత పదేళ్లలో రాష్ట్రాల వారీగా నమోదైన హెచ్ఐవీ కేసులను పరిశీలిస్తే దేశంలోనే ఏపీ నంబర్వన్ రాష్ట్రంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో కండోమ్ వాడకపోవడం వల్ల ఏపీలో 3,18,814 మందికి హెచ్ఐవీ సోకింది. ఈ జాబితాలో ఏపీ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (2,84,577 కేసులు), కర్ణాటక (2,12,982 కేసులు), తమిళనాడు (1,16,53 కేసులు), ఉత్తరప్రదేశ్ (1,10,911 కేసులు), గుజరాత్ (87,440 కేసులు) ఉన్నాయి.