CM YS Jagan Mohan Reddy: సంక్షేమ హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి… మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సమావేశంలో గతంలో ఇచ్చిన సీఎం ఆదేశాల అమలు ప్రగతిని ఆయనకు వివరించారు అధికారులు. అంగన్వాడీలలో సూపర్ వైజర్ల పోస్టులను భర్తీచేశామని తెలియజేశారు.. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ, వాటి ఫలితాలను వివరించారు.. అక్టోబర్ నెలలో నూటికి నూటికి నూరుశాతం పంపిణీ జరిగిందని తెలిపారు.. డిసెంబర్1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్ను అంగన్వాడీల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని.. పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా కొన్ని అంగన్వాడీల్లో అమలు చేస్తామన్నారు.. అయితే, మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం జగన్.
Read Also: Ponniyin Selvan 1: 500 కోట్లు వచ్చాయి.. కానీ పాన్ ఇండియా హిట్ కాదు…
అంగన్వాడీల నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలని ఆదేశించారు సీఎం జగన్.. మన పిల్లలే అక్కడకి వెళ్తారనుకుంటే ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా అంగన్వాడీలలో ఉండాలన్న ఆయన.. అంగన్వాడీలలో టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు.. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో నాడు – నేడుపై సీఎం సమీక్షలో కీలక వ్యాఖ్యలుచేవారు సీఎం.. మొత్తం మూడు దశల్లో నాడు – నేడు కార్యక్రమం ఉంటుందని.. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలన్నారు.. పిల్లలకు మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. హాస్టళ్లలో వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం పిల్లలకు ఉండకూడదన్నారు.. చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు.. వారు బాగా చదువుకోవడానికి, వారు బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలన్నారు.. సమాజంలో అట్టడుగున ఉన్నవారు తాము చదువుకోవడానికి తగిన పరిస్థితులు లేవన్న భావన ఉండకూడదని స్పష్టం చేశారు.
ఇక, హాస్టళ్లలో ఉంచాల్సిన బంకర్ బెడ్స్… తదితర సౌకర్యాలన్నీ కూడా నాణ్యతతో ఉండాలని సూచించారు సీఎం జగన్.. భవనాలను పరిగణలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలి..గురుకుల పాఠశాలలు– హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3013 చోట్ల నాడు–నేడు పనులు చేపట్టాలని నిర్ణయించారు.. మొదటి ఫేజ్లో మొత్తం సుమారు 1366 చోట్ల నాడు – నేడు పనులు చేపట్టాలని నిర్ణయించగా.. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ కూడా మొదట విడతలోనే బాగుచేయాలని సీఎం ఆదేశించారు.. మొదట విడతకు దాదాపుగా రూ.1500 కోట్లు, మొత్తంగా సుమారు రూ.3364కోట్ల వరకూ హాస్టళ్లలో నాడు – నేడు కోసం ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తొలివిడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. ఏడాదిలోగా ఆ పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలన్న ఆయన.. కిచెన్కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను ప్రతి హాస్టల్ కిచెన్ కోసం కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయంగా మార్పులు కనిపించాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యతతో అందించాలని సీఎం ఆదేశించారు. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలన్న సీఎం. మండలాలవారీగా పర్యవేక్షణ ఉండాలన్నారు.. హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలని.. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీచేయాలన్న సీఎం.. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్ –4 ఉద్యోగుల నియామకంపైనా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి హాస్టల్ను పరిశీలించి… కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలన్నారు. హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే.. ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలని.. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.