Topudurthi Prakash Reddy: టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy

Topudurthi Prakash Reddy: అనంతపురంలో వైసీపీ నాయకుడు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్‌ పేరుతో ప్రచారంలో ఉన్న “రెడ్‌బుక్” రాజకీయాలు అరాచకాలకు దారితీస్తున్నాయని విమర్శించారు. ఇక నుంచి తన రాజకీయ పోరాటం నేరుగా మంత్రి నారా లోకేష్‌పైనే ఉంటుందని ప్రకటించారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. శింగనమల సమీపంలో తన వాహనాన్ని ఒక టిప్పర్‌తో ఢీకొట్టి ప్రమాదానికి గురి చేయాలని ప్రయత్నించారని చెప్పారు. అయితే తన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. తన వాహనంపైకి దూసుకొచ్చిన టిప్పర్ టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్సీ సంస్థకు చెందినదేనని ఆరోపించారు.

ఈ ఘటన వెనుక టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబు కుట్ర ఉందని ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు వెలికితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక, మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనకు గత పదేళ్లుగా ఉన్న గన్‌మెన్ భద్రతను తొలగించారని పేర్కొన్నారు. శత్రువుల నుంచి ప్రాణహాని ఉందనే కారణంతోనే తనకు భద్రత కల్పించారని, ఇప్పుడు దానిని తొలగించడం ఆందోళనకరమని అన్నారు. మరోవైపు.. తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డిపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆరోపించిన ప్రకాశ్‌రెడ్డి, హత్యాయత్నాలు చేయించడం, తప్పుడు కేసులు బనాయించడం మంత్రి నారా లోకేష్ రాజకీయ విధానమా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి.