Thopudurthi Rajasekhar Reddy Arrest: అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది జనవరి 25న తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు సోమలదొడ్డి గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అయితే తన కుమారుడి మృతికి వైసీపీ నేతలే కారణమని మృతుడి తండ్రి మల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఇక, దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆడియో, వీడియో రికార్డులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన శాస్త్రీయ ఆధారాల ఆధారంగా అరెస్టులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే సాక్ష్యాధారాలతో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారించారు. తర్వాత ఆయనను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు సమాచారం. మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోవడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
