Nara Lokesh: రెడ్ బుక్ మరువను… కేడర్ను ఇబ్బంది పెట్టిన వారిని వదలను అంటూ మరోసారి స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్.. ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4వేల పెన్షన్ ఇవ్వడం లేదు. అవ్వతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ పెంచాం, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం. వాటిగురించి పార్టీ కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని పిలుపునిచ్చారు.. గుంతకల్లు నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న లోకేష్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే కసితో పనిచేయాలి. బాబు సూపర్ – 6, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పార్టీ తరపున పలు హామీలు ఇచ్చాం. ఒక్కొక్కటిగా వాటిని అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 11 నెలల ప్రజాప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ 4వేలకు, వికలాంగ పెన్షన్ 6వేలకు పెంచాం. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఆకలితీర్చే అన్నక్యాంటీన్లు ప్రారంభించాం. ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పథకంలో నిబంధనలు సడలించి లబ్ధిదారుల ఎకౌంట్ లో నేరుగా డబ్బులు చేయాలని నిర్ణయించాం. మత్స్రకారులకు ఆర్థికసాయం అందించాం, చేనేతలకు 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చాం. రోడ్లపై గుంతలన్నీ పూడ్చుకుంటూ వస్తున్నాం. జూన్ మాసంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఇస్తాం. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ముందుకెళ్తున్నాం అని తెలిపారు..
Read Also: Ashwin Babu: ధర్మరక్షణ కోసం… వచ్చినవాడు గౌతమ్
అయితే, మన ప్రభుత్వం స్కూళ్లు మూసివేస్తుందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు నారా లోకేష్. ఒక్క పాఠశాలను కూడా మూయడం లేదు. అది మన లక్ష్యం కాదు. ఒక క్లాస్ కు ఒక టీచర్ ఉండాలన్నదే మన ధ్యేయం. మన ప్రభుత్వంలో వచ్చేనాటికి కేవలం 1200 స్కూళ్లలో క్లాసుకో టీచర్ ఉంటే, ఇప్పుడు 9800 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో 45లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పుడు 33లక్షలకు పడిపోయారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం. మంత్రి నారాయణ సహకారంతో ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో మంచి ఫలితాలు వచ్చాయి. మన ప్రభుత్వం జూన్ మాసానికి సంవత్సరం అవుతుంది. జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తాం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అన్నీచేస్తాం. బీజేపీ, జనసేన పార్టీతో కలిసి పొత్తుతో పోటీచేశాం. నామినేటెడ్ పదవుల విషయంలో వారితో మాట్లాడి పదవులు ఇస్తున్నాం. కొందరు వైసీపీ వాళ్లు అపోహలు సృష్టిస్తున్నారు, వక్ఫ్ సవరణలు ప్రతిపాదించి ముస్లిం సోదరులకు అండగా నిలిచాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత టీడీపీ చూసుకుంటుంది. జనసేనతో కలిసి పోటీ చేశాం, భవిష్యత్తులో కలిసే ప్రయాణం చేస్తాం, మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు అని స్పష్టం చేశారు.. దేశవ్యాప్తంగా విశాఖ స్టీల్ తప్ప అన్ని ప్రైవేటీకరిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సాయం చేస్తున్నారు. వైసీపీ వాళ్లు చిచ్చుపెట్టాలని చూస్తారు, సమర్థవంతంగా తిప్పికొట్టండి అని పిలుపునిచ్చారు లోకేష్..
Read Also: Ashwin Babu: ధర్మరక్షణ కోసం… వచ్చినవాడు గౌతమ్
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయలేనిది 11నెలలో చేసి చూపించాం అన్నారు లోకేష్.. కరెంటు చార్జీలు పెంచమని చెప్పాం. జగన్ నిర్వాకం వల్లే ట్రూ అప్ చార్జీలు వేయాల్సి వస్తోంది. దీనిపై మనం మాట్లాడకపోతే దెబ్బతింటాం. 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చాం. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి పెద్దఎత్తున కంపెనీలు వస్తున్నాయి. అనంతపురానికి రూ. 22వేల కోట్ల విలువైన భారీ సోలార్ విండ్ ప్రాజెక్టు వస్తోంది. విశాఖకు టీసీఎస్ డెవలప్ మెంట్ సెంటర్ వస్తోంది. రాబోయే ఐదేళ్లలో మనపిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేనివిధంగా ప్రజలు కూటమికి 94శాతం సీట్లు ఇచ్చారు. సునామీ మాదిరి ప్రజలు ఇచ్చిన తీర్పుతో చరిత్ర తిరగరాశాం, దీనివెనుక కార్యకర్తల కష్టం, త్యాగాలు ఉన్నాయి. నాలుగున్నర దశాబ్ధాల్లో అధికారం, ప్రతిపక్షం రెండూ చూశాం. అయితే గత అయిదేళ్ల లాంటి అరాచక పాలన ఇదివరకెన్నడూ చూడలేదన్నారు.. ఇక, టీడీపీ రెండేళ్లకోసారి చేపట్టే సభ్యత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా చేసి చూపించారు. భారత్ లో ఏ పార్టీకి లేనివిధంగా కోటి సభ్యత్వాలు టీడీపీకే సొంతం. దానికి కార్యకర్తల కష్టమే కారణం. కార్యకర్తల బీమాను అయిదులక్షలకు పెంచాం, పేదపిల్లలకు నిరంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య అందిస్తున్నాం. కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం అన్నారు…
ఇక, పార్టీ కేడర్ ఎర్ర బుక్ గురించి అడుగుతున్నారు. మన కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని వదలను.. నా అంతట నేనుగా ఎవరితో గొడవపెట్టుకోను, మన జోలికి వస్తే మాత్రం వదలను అంటూ హెచ్చరించారు నారా లోకేష్. గత ప్రభుత్వంలో మద్యంలో ఎంత కుంభకోణం జరిగిందో రాష్ట్రమంతా చూస్తున్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కొంచెం సమయం పట్టొచ్చు. కార్యకర్తలు అహంకారం లేకుండా ప్రజల్లోకి వెళ్లి వారి చుట్టూ తిరగాలన్నారు.. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కేడర్ కు చేరవేసేందుకు మహానాడు తర్వాత కొత్త యాప్ మై టీడీపీ పేరుతో కొత్త యాప్ విడుదల చేస్తాం. కెఎస్ఎస్, బూత్, క్లస్టర్, అందరికీ ఒకే యాప్ ద్వారా కార్యక్రమాలపై సందేశాలు పంపిస్తాం. ఈనెల 18,19,20 నియోజకవర్గ స్థాయిలో మినీ మహనాడు జరుగుతుంది. 27,28, 29 కడపలో మన పెద్దపండుగ మహనాడు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్..
