Godavari Flood: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో నది పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద ఉధృతితో చాకలపాలెం- కనకాయలంక కాజ్వే నీట మునిగిపోయింది. నెల రోజుల క్రితం గంటి పెదపూడిలో గోదావరిలో వేసిన తాత్కాలిక రహదారి తెగిపోవడంతో నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జి. పెదపూడి లంక, బూరుగు లంక, అరిగినవారి పాలెం, ఊడిమూడి లంక గ్రామాల ప్రజలు ప్రస్తుతం పడవలపైనే రాకపోకలు కొనసాగిస్తున్నారు.
Read Also: Archana Tiwari: నేపాల్ సరిహద్దులో అర్చన తివారీ ప్రత్యక్షం.. మిస్టరీ ఎలా వీడిందంటే..!
అయితే, స్కూలుకు వెళ్తున్న విద్యార్థులు కూడా పడవలపై ప్రయాణం చేయడం వల్ల ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు భయాందోళనకు గురవుతుండగా, మరింత వరద పెరిగితే అయినవిల్లి- ఎదురు బిడియం, అప్పనపల్లి కాజ్వేలు కూడా మునిగిపోవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టామన్నారు.