ఏపీలో మళ్ళీ ప్రత్యేక హోదా రచ్చ ప్రారంభమయింది. ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగించింది కేంద్ర హోంశాఖ. తొలుత ప్రత్యేక హోదా, రిసోర్స్ గ్యాప్ అంశాలను అజెండాలో పేర్కొన్న కేంద్ర హోంశాఖ. తర్వాత వాటిని తొలగించడం వివాదాస్పదం అవుతోంది. ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ కమిటీ ఎజెండా ఎందుకు మారింది?త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకువచ్చిన 9 అంశాలను మార్చాలని జీవీఎల్ ప్రకటన చేశారన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఏపీకి అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే జీవీఎల్ ఎందుకంత హడావిడి పడ్డారు?జీవీఎల్ వివరణ ఇవ్వాలి. ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండడాన్ని టీడీపీ ఎందుకు స్వాగతించలేదు?
సుజనా చౌదరి, సీఎం రమేష్లు చంద్రబాబు ఆదేశాలతో ఎజెండాను మార్పించారని స్పష్టమవుతోంది. హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా? తన అధికారాలు ఏమిటో తమకే తెలియదా? తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య ప్రత్యేక హోదా, రీసోర్సెస్ గ్యాప్ అంశాలను త్రిసభ్య కమిటీ నేరుగా ఏపీ అధికారులతో చర్చించవచ్చు కదా అన్నారు అంబటి.
మరి దాన్ని కూడా ఆపాలని ఎందుకు ప్రయత్నించారు? ఆ కమిటీకి హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. వారికి తమ పరిధిలోకి వచ్చే అంశాలు, రాని అంశాలు ఏవో తెలియదని జీవీఎల్ రంగంలోకి ఎందుకు దిగారు? చంద్రబాబు, ఆయన పంపించిన వ్యక్తుల శకుని పాత్రపై, పరిధి దాటిన జీవీఎల్ ప్రకటన పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు.