YSP MPs Meet Amit Shah: న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం కలిసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం లేదని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా జిల్లాల పర్యటనల సమయంలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని, ఇటీవల దేవరపల్లి పర్యటనలో భారీగా ప్రజలు హాజరైనప్పటికీ సరిపడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని వివరించింది.
గత రెండేళ్లుగా వైఎస్ జగన్ నిర్వహిస్తున్న పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఎంపీలు ఆరోపించారు. జగన్కు పటిష్టమైన భద్రత కల్పించేలా కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు.
భద్రత అంశంతో పాటు డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని కూడా ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుల వివరాలను కూడా కేంద్ర హోంమంత్రికి వివరించారు.
గత రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు లాకప్ మరణాలు చోటుచేసుకున్నాయని, ఇది ఆందోళనకరమని పేర్కొన్నారు. భారతి సిమెంట్స్ను అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని సంస్థ కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తూ, ప్రజాస్వామ్య హక్కులు, న్యాయపాలన, ప్రజల భద్రత పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

