YS Jagan: విజయవాడ సాయికృష్ణ కేసులో పోలీసు ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులను మాత్రమే బాధ్యులుగా చూపిస్తూ అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్ను పరిశీలిస్తే పై అధికారులను ఎలా కాపాడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అన్నారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించారని, దీనికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉందని జగన్ పేర్కొన్నారు. సాయికృష్ణ తల్లి, బంధువులు సీపీ, డీజీపీకి ఫిర్యాదులు చేసినా స్పందించలేదని, రాష్ట్రంలో వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయని ఆరోపించారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విషయంలోనూ అనేక సందేహాలు ఉన్నాయని జగన్ అన్నారు. ఒక రిమాండ్ రిపోర్ట్లో నెల రోజుల ఫుటేజ్ లేదని, మరో రిపోర్ట్లో 18 నెలల ఫుటేజ్ అందుబాటులో లేదని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. క్లౌడ్ సర్వర్లలో డేటా అందుబాటులో ఉన్నప్పటికీ దానిని ఎందుకు సేకరించలేదని, కాల్ రికార్డులు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన జగన్, సాయికృష్ణ కేసుతో పాటు ఇతర ఘటనల్లోనూ పూర్తి స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ, చట్ట అమలుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..

